ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి అధికారం లేకుండా పోతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంపై అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు. కాని తమ ప్రభుత్వం తన పనులను ఇతర పార్టీలు చేయాలని ఎప్పటికీ కోరుకోదని వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ దేశ రాజధానిలో తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని అన్నారు.
నీటి బిల్లులను సరిచేసే వన్టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని కొందరు అధికారులు అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. బిజెపి నుంచి వస్తున్న ఒత్తిడులు, బెదిరింపుల వల్లే వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ పథకం క్లియరెన్స్ కోసం అధికారులను ఆదేశించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు విజ్ఞప్తి చేశారు. వన్టైమ్ సెటిల్మెంట్ పథకం వల్ల 10.5 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని ఆయన వివరించారు.