భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేసిన మరో రాకెట్ ప్రయోగం విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్(శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 వాహక నౌక ..ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 18.46 నిమిషాల అనంతరం 2,275 కిలోల బరువు ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్సాట్-3డీఎస్ను వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఇన్సాట్-3డీఎస్తో భూ, సముద్ర వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందుతుందని తెలిపారు.