భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బిహార్లోని కైముర్ జిల్లాలో మొహనియాలో స్థానిక యువతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. దేశంలోని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూరేలా రక్షణ రంగ బడ్జెట్ను మోడీ ప్రభుత్వం ఖర్చు చేయాలనుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకోసమే కేంద్రం అగ్నివీర్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ ప్రాంతం బిహార్-ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఇక్కడి యువతలో ఎక్కువమంది కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. రెండేళ్ల క్రితం ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఎక్కువమంది యువత ఆందోళనలు చేపట్టారు.
సాధారణ సైనికులకు లభించినట్లు అగ్నివీర్లకు జీతం, పెన్షన్ లభించవు. క్యాంటీన్ వసతి కూడా ఉండదు. రక్షణ బడ్జెట్లో సైనికుల జీతాలు, ప్రోత్సాహకాల కోసం ఖర్చు చేయాలని మోడీ ప్రభుత్వం భావించడం లేదు. ఆ మొత్తాన్ని దేశంలోని బడా వ్యాపార సంస్థల లబ్ధి కోసం ఖర్చు చేయాలనుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చి.. అధికారంలోకి రాగానే 45 ఏళ్లలో రికార్డు స్థాయిలో దేశంలో నిరుద్యోగుల సంఖ్యను పెంచారు ” అని రాహుల్ విమర్శించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమైన రాహుల్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పంటకు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు.