వీల్ చైర్ లేని కారణంగా ఓ 80 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఫిబ్రవరి 12న ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ఫోర్ట్లో జరిగింది.
80 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఈ నెల 12వ తేదీన న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబైకి చేరుకున్నాడు. వారు తమ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ముందుగానే రెండు వీల్ చైర్స్ను బుక్ చేసుకున్నారు. అయితే, ఎయిర్పోర్ట్లో వీల్చైర్స్ షార్టేజ్ ఉండటంతో సిబ్బంది వారికి ఒక వీల్చైర్ను మాత్రమే ఇచ్చారు. మరోదాని కోసం కొద్దిసేపు వేచి ఉండాలని సూచించారు. కానీ, అతను మాత్రం వెయిట్ చేయకుండా తన భార్యను ఒక వీల్చైర్లో కూర్చోబెట్టి విమానం దగ్గర నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకూ నడుచుకుంటూనే వచ్చాడు. సుమారు 1.5 కిలోమీటర్లు మేర నడవడంతో అతడు ఆయాసపడిపోయి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.