Sunday, September 22, 2024
HomeUncategorizedకేంద్రంతో ఘర్షణ పడేందుకు రాలేదు

కేంద్రంతో ఘర్షణ పడేందుకు రాలేదు

Date:

కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడేందుకు తాము రాలేదని, ప్రధాని మోడీ పెద్ద మనసుతో ఎమ్‌ఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు కోరాయి. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. బుధవారం మరోసారి పంజాబ్‌ నుంచి హరియాణాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు టియర్‌ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ”చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారి ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి” అని మంత్రి తెలిపారు.

మరోవైపు ‘ఢిల్లీ చలో’ కార్యక్రమంలో పాల్గొనే రైతులపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారని రైతు సంఘం నాయకుడు సర్వణ్‌ సింగ్ పంథేర్‌ తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం ఆందోళనలో భాగంగా గాయపడిన రైతులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందన్న ఆయన, రైతులపై దాడిని ఖండించారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులపై 2010లో బిజెపి సభ్యుడు ప్రకాశ్‌ జావడేకర్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేవీ థామస్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. దానికి సంబంధించిన కాపీ తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో పంటకు కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువ ఉండాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిపారు. దానిని మన్మోహన్‌ సింగ్ ప్రభుత్వం అంగీకరించలేదని వెల్లడించారు. ఎమ్‌ఎస్‌పీ, ఉత్పత్తి వ్యయం అనుసంధానం మిగిలిన వాటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అందుకే ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మంగళవారం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఎమ్‌ఎస్‌పీకి చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే