Friday, September 27, 2024
HomeUncategorizedవివిధ లోక్‌సభ స్థానాల నుండి 15మంది సీఎంలు పోటీ

వివిధ లోక్‌సభ స్థానాల నుండి 15మంది సీఎంలు పోటీ

Date:

దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలు మాజీ ముఖ్యమంత్రులను రంగంలోకి దించుతున్నాయి. ఈ క్రమంలోనే మొత్తం 15 మంది మాజీ సీఎంలు.. ఈసారి లోక్‌సభకు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 12 మంది ఎన్డీఏ కూటమి నుంచి ఉండగా.. ఇండియా కూటమి నుంచి ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌.. అతి తక్కువగా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉత్తర్‌ప్రదేశ్ సీఎం జగదాంబికా పాల్ ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. విదిషా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనే కాకుండా అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌ కూడా లోక్‌సభ బరిలో ఉన్నారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ దేవ్‌, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌.. జార్ఖండ్‌ మాజీ సీఎంగా అర్జున్‌ ముండా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రస్తుత 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగదీష్‌ శెట్టర్‌, బసవరాజ్‌ బొమ్మైలు కూడా ఈసారి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముఖ్యమంత్రులుగా చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌లు కూడా ఈసారి లోక్‌సభకు పోటీ పడుతున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నబంతుకి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి.. ఆ రాష్ట్రంలో ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్‌ మద్దతుతో సీఎంగా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పొత్తులో భాగంగా ఆయన మండ్య నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సుమలతకు హై కమాండ్ మొండిచేయి ఇచ్చింది.

ప్రస్తుతం సర్బానంద సోనోవాల్‌, బిప్లబ్‌ కుమార్‌ దేవ్‌, దిగ్విజయ్‌ సింగ్‌లు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారి పార్టీలు.. వారిని లోక్‌సభ బరిలోకి దింపాయి. ఇక రాజ్‌నాథ్‌ సింగ్‌, జగదాంబికా పాల్‌, అర్జున్‌ ముండా ప్రస్తుతం లోక్‌సభ సభ్యులుగా ఉండగా.. మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మిగిలినవారంతా కొత్తగా ఈసారి ఎన్నికల్లో తలపడుతున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా బీజేపీలో చేరి ప్రస్తుతం లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌పార్టీతోపాటు, ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి.. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలయ్యారు. అనంతరం 2018లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత గతేడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు.