మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయానికి రూ.500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్లలో తమ కుటుంబం ఈ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీని అత్యుత్తమ కేంద్రంగా మార్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100కోట్లు పక్కన పెట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఈ యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థ ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్కు మరో రూ.50కోట్లు ఇస్తామని ప్రకటించారు. 2020లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ స్థాయిల్లో 35 ప్రోగ్రామ్లను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఇందులో 4100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 10శాతం పీజీ చేస్తున్నవారే. త్వరలోనే ఈ యూనివర్సిటీ కింద స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, లిబరల్ ఆర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.