ఢిల్లీ లిక్కర్ వి నం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన సతీమణి సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచేందుకు ఈడీ అధికారులు తీసుకురాగా.. అక్కడికి వచ్చిన సునీత విలేకర్లతో మాట్లాడారు. తన భర్త ఆరోగ్యం బాగా లేదని.. చక్కెరస్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈడీ అధికారులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ దౌర్జన్యం ఎంతోకాలం సాగదని, ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియగా.. ఆయన్ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ అధికారులు మరో ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. జడ్జి నాలుగు రోజుల కస్టడీకి అనుమతించారు. తిరిగి ఏప్రిల్ 1న హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో కేజ్రీవాల్ ఏప్రిల్ 1వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.