Friday, September 27, 2024
HomeUncategorizedఈదురు గాలులకు పక్కింటి డాబాపై పడ్డ చిన్నారి

ఈదురు గాలులకు పక్కింటి డాబాపై పడ్డ చిన్నారి

Date:

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఊయలలో ఆడుకుంటున్న చిన్నారి ఎగిరి 20 మీటర్ల దూరంలో డాబాపై పడి మృతిచెందింది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లగా ఇంట్లో ఉన్న కవల పిల్లలు రేకులు షెడ్డుకు ఊయల కట్టుకుని ఆడుకుంటున్నారు. ఇంతలో గాలిదుమారం సుడిగాలిలా విరుచుకుపడటంతో చిన్నారి సంగీత రేకుల షెడ్డుతో సహా విసిరికొట్టడంతో మృతి చెందింది.

ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాలో మంజుల, మాన్సింగ్‌ దంపతులకు కవలలు సంగీత, సీత సంతానం. అదే తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సంగీత (5) ఒకటో తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లగా ఇంట్లో రేకుల షెడ్డుకు కట్టిన చీర ఉయ్యాలలో సంగీత ఆడుకుంటుంది. నానమ్మ, సీత పక్కింటి వెళ్లడంతో చిన్నారి ఒక్కతే ఇంట్లో ఆడుకుంటూ ఉంది. ఇంతలో కొద్దిసేపటికే భారీగా సుడిగాలి వీచింది. దీంతో ఇంటి రేకులతోపాటు చిన్నారి సంగీత ఎగిరిపోయి సుమారు 20 మీటర్ల దూరంలో రెండు ఇళ్ల అవతల ఉన్న స్లాబ్‌పై పడింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ఇరుగుపొరుగు గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సంగీతను 108లో నర్సాపూర్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చిన్నారి సంగీత మరణించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు