Sunday, September 29, 2024
Homeక్రైంజగన్‌పై దాడి చేసిన అనుమానితుడు అరెస్ట్

జగన్‌పై దాడి చేసిన అనుమానితుడు అరెస్ట్

Date:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని కోర్టులో హాజరుపర్చారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.

మరో వైపు.. రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్‌ వేశారు. న్యాయవాది కమిషనర్‌ను నియమించాలని పేర్కొన్నారు. ఇంకెవరిని ఇరికిస్తారో అనే భయంతో కాలనీ వాసులు కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రెండు, మూడు వీధులు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.