ఆస్తుల మాయలో పడి బంధాలు, బంధుత్వాలను దూరం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి భూ వివాదం నేపథ్యంలో దారుణానికి పాల్పడ్డాడు. సొంత సోదరుడి మీదకు ట్రాక్టర్ను నడిపి చక్రాలతో తొక్కించాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో జరిగింది. తివాయా గ్రామానికి చెందిన అన్నాదమ్ములైన రామ్కుమార్, ఓంకుమార్ మధ్య పూర్వీకులకు సంబంధించిన భూమిపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ట్రాక్టర్పై ఉన్న రామ్కుమార్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎదురుగా ఉన్న సోదరుడైన 65 ఏళ్ల ఓంకుమార్ మీదకు ట్రాక్టర్ను దూకించాడు. ఇటుక గోడను ఢీకొట్టి మరీ సోదరుడ్ని ట్రాక్టర్ చక్రాలతో తొక్కించాడు. దీంతో తమ్ముడు ఓంకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఓంకుమార్ భార్య కూడా గాయపడింది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ టైర్ల కింద నలిగిన ఓంకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతడి పరిస్థితి సీరియస్గా ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.