ఓ చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. జీతం తక్కువని తెలిసినా యువత ఐఏఎస్ అవ్వాలని ఎందుకనుకొంటారో అర్థం కాదు అని చిరాగ్ చౌహాన్ అనే సీఏ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోస్టులో ఆయన.. సీఏలు, ఐఏఎస్ అధికారులు పొందే జీతాలను పోల్చారు. ఐఏఎస్ అధికారుల సగటు జీతం సీఏ ఉద్యోగులకు వచ్చే ఆరంభ వేతనంతో సమానం అని పేర్కొన్నారు. అయినా ప్రజలు ఐఏఎస్ కావాలని ఎందుకనుకుంటారు అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ”ఐఏఎస్ అయ్యేది డబ్బు కోసం కాదు. ఆ స్థానానికి ఉన్న అధికారం, గౌరవం, ప్రజలకు సేవ చేయాలనే ఆశయం కోసం” అని తెలిపారు. ”దేశంలో సివిల్స్లో అర్హత సాధించే వారి సంఖ్య.. సీఏ పరీక్ష పాసయ్యేవారికంటే తక్కువ. ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటే ఆ వృత్తిలో కొనసాగాలనుకుంటారు. జీతంతో దీనికి సంబంధం లేదు” అని మరో నెటిజన్ స్పందించారు. మరో యూజర్ స్పందిస్తూ ”మీరు ఉద్యోగంలో చేరగానే మేనేజర్ హోదా.. ప్రత్యేక ఆఫీసు, ఉచితంగా బంగ్లా, పెట్రోల్, డ్రైవర్, సేవకుడు ఇవన్నీ ఇచ్చారా?.. ఐఏఎస్లకు ఈ సౌకర్యాలన్నీ ఉంటాయి” అని రాసుకొచ్చారు.