Sunday, September 29, 2024
HomeUncategorizedజైల్లో కేజ్రీవాల్‌ మరణించేలా కుట్ర జరుగుతోంది

జైల్లో కేజ్రీవాల్‌ మరణించేలా కుట్ర జరుగుతోంది

Date:

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీహార్ జైల్లో భారీ కుట్ర జరుగుతోందని ఆప్‌ పార్టీ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ శనివారం ఆరోపించారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ఆయన అవయవాలపై ప్రభావం పడి అనారోగ్య సమస్యలతో నెమ్మదిగా మరణించేలా జైల్లో కుట్ర జరుగుతోందని అన్నారు. కేజ్రీవాల్‌ తన రెగ్యులర్‌ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన ఒక రోజు అనంతరం భరద్వాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ”కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వకపోవడం వల్ల గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల రెండు, మూడు నెలల అనంతరం ఆయనను విడుదల చేసినా ఏ ప్రయోజనం ఉండదు. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుంది” అని భరద్వాజ్‌ అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ మెడికల్ బెయిల్ కోసం చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారని ఇటీవల ఈడీ ఆరోపించింది. శుక్రవారం జరిగిన విచారణలో కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈడీ చేసిన ఆరోపణలను ఖండించారు. బెయిల్‌ కోసం తమ నేతకు పక్షవాతం రావాలని తాము కోరుకుంటామా అని ప్రశ్నించారు. డాక్టర్‌ తయారుచేసిన డైట్ చార్ట్ ప్రకారమే సీఎం ఆహారం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.