కేకే, కడియం వంటి నాయకులు పార్టీని కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో చాలా చోట్ల ప్రచారం చేశాను. తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామనుకున్నాం. ఏం జరిగిందో తెలియదు. కొన్ని చోట్ల ఓడిపోయాం. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. పట్నం మహేందర్రెడ్డి వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదట రంజిత్రెడ్డే ఫోన్ చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా నన్ను ప్రకటించు.. తప్పకుండా గెలుద్దామని చెప్పారు.
రంజిత్రెడ్డి, మహేందర్రెడ్డి నాకంటే ఎక్కువగా కాంగ్రెస్ను తిట్టారు. ఆస్కార్ నటుల కంటే బాగా నటించారు. పార్టీ మారిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలి. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటు వేసిన వాళ్లు బాధ పడే పరిస్థితి వచ్చింది. తుక్కుగూడ కాంగ్రెస్ సభకు కర్ణాటక నుంచి కూడా జనాలను తెప్పిస్తున్నారు. ఏప్రిల్ 13న చేవెళ్లలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం. రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం.. ఉద్యమం ఉద్ధృతం చేద్దాం” అని చెప్పారు.