Friday, September 27, 2024
HomeUncategorizedమహిళకు మాత్రం బస్సు టికెట్ ఫ్రీ

మహిళకు మాత్రం బస్సు టికెట్ ఫ్రీ

Date:

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఐతే ఒక మహిళ తన చిలుకలతో బస్సులో ప్రయాణించింది. ఆమెకు ఫ్రీ టికెట్ వర్తించగా.. ఆమెతో ఉన్న చిలుకలకు మాత్రం సగం టికెట్ ధర చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థొ బస్సులో నాలుగు చిలుకలను తీసుకెళ్తున్న యజమానికి ఓ కండక్టర్‌ రూ.444ల టికెట్‌ కొట్టాడు. ప్రస్తుతం ఈ టికెట్‌ సోషల్ మీడియాలోని పలు ప్లాట్ ఫాంలలో వైరల్‌ అవుతోంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఓ మహిళ చిన్నారితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బయలుదేరింది. లవ్‌బర్డ్‌లను కొనుగోలు చేసి మైసూరు బస్సు కేఎస్ఆర్‌టీసీ బస్సు ఎక్కగా.. ప్రభుత్వ పథకాల్లో ఒకటైన ‘శక్తి’ ద్వారా కండక్టర్ మహిళ, చిన్నారికి ఉచిత టికెట్‌ ఇచ్చారు. అయితే, నాలుగు చిలుకలకు మాత్రం టికెట్ కొట్టారు. చిలకలను బాలలుగా పరిగణిస్తూ ఒక్కో దానికి రూ.111 చొప్పున రూ.444 టికెట్‌ ఇవ్వగా.. అది చూసిన మహిళతో పాటు తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవ్వగా.. కేఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. నిబంధనల ప్రకారమే టికెట్ ఇచ్చినట్లు కేఎస్ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమతో తీసుకెళ్లే జంతువులు, పక్షులకు సగం టికెట్‌ ధర చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. టికెట్ తీసుకోని ప్రయాణికులకు వారి ప్రయాణ టికెట్‌ ధరలో పది శాతం జరిమానా విధిస్తామన్నారు. ఒకవేళ ఇలా టికెట్ ఇవ్వని కండక్టర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవటం జరుగుతుందని.. ఇదంతా ఆర్టీసీ నిబంధనల్లోనే ఉందని అధికారులు వెల్లడించారు.