ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు.. మొత్తం 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కవితను తీహార్ జైలుకు తరలించారు. కవిత వేసిన బెయిల్ మధ్యంతర పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 1న ఆ పిటిషన్ వేస్తామని స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను తర్వాత విచారిస్తామని రౌజ్ అవెన్యూ కోర్టు పేర్కొంది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. మరో 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు ఆయన వాదించారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయినందున.. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమో తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమెను తీహార్ జైలుకు తరలించారు.
రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇది తప్పుడు కేసని.. కావాలని ఇరికించారని ఆరోపించారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని.. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. తనను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చు గానీ.. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరాడని… మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇస్తోందని కవిత ఆరోపించారు. మూడో నిందితుడు ఏకంగా రూ.50 కోట్లను ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపికి ఇచ్చాడని విమర్శించారు. అనంతరం జై తెలంగాణ..జై కేసీఆర్ నినాదాలు చేస్తూ.. కోర్టులోకి వెళ్లారు కవిత.